ప్రజాస్వామ్యం సజావుగా సాగాలి

Democracy should run smoothly– గవర్నర్లు సమన్వయంతో పని చేయాలి
– సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి
– మూడు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలో కొత్త శకం
– గవర్నర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచన
– గవర్నర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజాస్వామ్యం సజావుగా సాగడమే కీలకమని, అందుకు గవర్నర్లు సమన్వయంతో పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. గత దశాబ్దంలో జరిగిన సామాజిక సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించే రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. శుక్రవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడమే కాక సామాన్య ప్రజల సంక్షేమ పథకాలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్న అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఈ సదస్సుకు సంబంధించిన ఎజెండాలో జాతీయ లక్ష్యాలను సాధించడంలో కీలక అంశాలను పొందుపరిచినట్టు తెలిపారు. ఈ చర్చల్లో పాల్గొనే వారందరికీ మంచి అనుభూతిని కలిగిస్తాయని, వారి పనితీరులో సహాయపడతాయని అన్నారు.
గవర్నర్లు ఉన్నత విద్యా సంస్కరణలకు సహకరించాలి
నాణ్యమైన ఉన్నత విద్య, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక మార్పుతో పాటు ఆవిష్కరణ, ఆర్థిక పురోగతిని ప్రోత్సహిస్తున్నందున అది కనిపించని ఆస్తి అని రాష్ట్రపతి అన్నారు. జాతీయ విద్యా విధానంలో విద్యాసంస్థల అక్రిడిటేషన్‌, అసెస్‌మెంట్‌ వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ల హౌదాలో గవర్నర్లు ఈ సంస్కరణ ప్రక్రియకు సహకరించాలని ఆమె కోరారు. నేర న్యాయానికి సంబంధించి మూడు కొత్త చట్టాలను అమలు చేయడంతో దేశంలో న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభమైందని అన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే చట్టాల పేర్లను బట్టి మన ఆలోచనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం సజావుగా సాగేందుకు, అన్ని రాష్ట్రాలలో వివిధ కేంద్ర సంస్థలు మెరుగైన సమన్వయంతో పనిచేయడం చాలా కీలకమని అన్నారు. ఆయా రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా ఈ సమన్వయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారో ఆలోచించాలని గవర్నర్లకు సూచించారు.
సహజ వ్యవసాయంతోనే రైతుల ఆదాయం పెంచొచ్చు
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో భూసారాన్ని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాజ్‌భవన్‌లు ఆదర్శంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. పేదలు, సరిహద్దు ప్రాంతాలు, అణగారిన వర్గాలు, ప్రాంతాలు, వెనుకబడిన ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. గిరిజన జనాభాలో ఎక్కువ భాగం షెడ్యూల్డ్‌, గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్నారని, ఈ ప్రాంతాల ప్రజల సమగ్ర అభివృద్ధిని సాధించడానికి మార్గాలను సూచించాలని ఆమె గవర్నర్లను కోరారు. ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు గవర్నర్లు సహకరించాలని అన్నారు. యువతలోని శక్తిని సానుకూలంగా, నిర్మాణాత్మకంగా మార్చగలిగితే ‘యువాభివృద్ధి’, ‘యువత నేతృత్వంలోని అభివృద్ధి’ మరింత ఊపందు కుంటాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. గవర్నర్లందరూ తమ ప్రమాణానికి న్యాయం చేస్తూ ప్రజల సేవకు, సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధి గవర్నర్లు : ప్రధాని మోడీ
గవర్నర్లు కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా వ్యవహరిస్తారని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాజ్యాంగ పరిధిలోని రాష్ట్ర ప్రజల సంక్షేమంలో వారి పదవి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కీలకపాత్ర పోషించగలదని అన్నారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు, గ్రామాలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆ ప్రాంతాలను సందర్శించాలని గవర్నర్లను కోరారు.

Spread the love