నవతెలంగాణ – హైదరాబాద్: ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల భూమిని కాజేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ కాజేసిన భూముల వివరాలు బయటకు తీస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పసలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అభివృద్ధి చూసి ఓర్వలేక కొందరు కాకుల్లా అరుస్తున్నారు. హైడ్రా, మూసీ విషయంలో ఆలోచన చేశాకే ముందుకు పోతున్నాం. మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణ సదుపాయం కల్పిస్తాం’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.