‘కిన్నెర మొగులయ్య’ స్థలంలో ప్రహరీ ధ్వంసం

Vandalism at 'Kinnera Mogulaiya' place– గుర్తు తెలియని వ్యక్తులు కూల్చినట్టు పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ-హాయత్‌ నగర్‌
‘కిన్నెర మొగులయ్య’గా పేరుగాంచిన ప్రముఖ జానపద కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలంలో మొగులయ్య నిర్మించుకున్న కాంపౌండ్‌ వాల్‌ను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. వివరాల్లోకెళ్తే.. మొగులయ్య తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి చేసిన సేవలకు గుర్తింపుగాను మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం హయత్‌నగర్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ ఇంటి స్థలం ధ్రువపత్రాలను మొగులయ్యకు సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవలే అందజేశారు. దాంతో ఆ స్థలంలో ఆయన కాంపౌండ్‌ వాల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొందరు దుండగులు గురువారం రాత్రి ఆ కాంపౌండ్‌ వాల్‌ను ధ్వంసం చేశారు. ఈ విషయంపై మొగులయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మొగులయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.నాగరాజు గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్లాట్‌కు సంబంధించిన భూమి వివాదం లేదని, ప్రహరీ కూల్చివేతపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Spread the love