నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను సోమవారం గ్రామస్తులకు పంపిణీ చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పలువురు విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ చేతుల మీదుగా గ్రామస్థులకు పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్థులు మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించి పూజలు చేయాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వివిధ రంగులతో తయారు చేసిన విగ్రహాలు నీటి కాలుష్యానికి, పర్యావరణానికి హాని చేస్తాయన్నారు. మట్టి గణపతి ప్రతిష్టించి పూజలు చేసిన అనంతరం వాటిని ఇంటి వద్దనే నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వసంత్ నాయక్, పంచాయతీ కార్యదర్శి నరసయ్య, గంగాధర్, ప్రశాంత్, ముతెన్న, తదితరులు పాల్గొన్నారు.