– పీర్జాదీగూడ లో బీఆర్ఎస్ దుశ్చర్య
– మల్లారెడ్డి కాలేజ్ సిబ్బందిని పట్టుకున్న ఎన్నికల అధికారులు
– ఓటమి భయంతోనే ప్రలోభాలు – కాంగ్రెస్ పార్టీ నేతలు
నవతెలంగాణ-బోడుప్పల్: ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త ఎత్తుగడలను అవలంబిస్తున్నారు ఓటర్లకు డబ్బుల పంపిణీ చేసే సమయంలోనే అదే చెత్తో ఓ మత గ్రంథంపై ప్రమాణం చేయిస్తుండగా సదరు వ్యక్తులను పట్టుకున్న సంఘటన మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదీగూడ కార్పొరేషన్ లో సోమవారం నాడు చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలోని 9 వ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు చేయించేందుకు గాను బీఆర్ఎస్ పార్టీ నేతలు, మల్లారెడ్డి కాలేజ్ కు చెందిన సిబ్బంది ఓటర్ లిస్టులల ఆదరంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడమే కాకుండా వారితో ఓ మత గ్రంథంపై ఓటర్లతో ప్రమాణం చేయిస్తుండగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు,ఎన్నికల అధికారులు వారి వద్ద నుండి రు.1.50 లక్ష నగదు,ఓ మత గ్రంథం, ఓటర్ల లిస్ట్, తీసుకున్న వారి పేర్ల వివరాలతో కూడిన మరో లిస్ట్ ను స్వాధీనం చేసుకున్నాట్లు ఎఫ్ఎస్టీ రాధిక తెలిపారు. అనంతరం పట్టుబడిన నగదు, మల్లారెడ్డి కాలేజ్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పీఎస్ కు తరలించారు.
మల్లారెడ్డిపై ఎన్నికల కమీషనర్ చర్యలు తీసుకోవాలి…
ఎన్నికలలో అక్రమ పద్దతులలో గెలిచేందుకు మల్లారెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడని మల్లారెడ్డిపై ఎన్నికలలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీర్జాదీగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాగో ఓటమి తప్పదని తెలిసి మల్లారెడ్డి ప్రలోభాలకు తెరదీశాడని వాపోయారు.ఇప్పటికైన మల్లారెడ్డిపై,కాలేజ్ సిబ్బందిపై చర్యలు తీసుకోని ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా సుధాకర్ రెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, కవిడే కుమార్, భాస్కర్ బండిరాళ్ల,రంజిత్ రెడ్డి,చింత నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.