నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఒక రోగికి సర్జరీ చేస్తున్నారు. అయితే విద్యుత్ కోత కారణంగా ఆపరేషన్ థియేటర్లోని ఎమర్జెన్సీ లైట్లు ఆగిపోయాయి. దీంతో ఆ రోగికి శస్త్రచికిత్సను డాక్టర్లు నిలిపివేశారు. కరెంట్ తిరిగి వచ్చే వరకు వైద్యులు వేచి ఉన్నారు. దీని గురించి ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్లోని పాటియాలాలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ప్రభుత్వ రాజీంద్ర ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆపరేషన్ థియేటర్లో ఒక రోగికి ఆపరేషన్ చేశారు. అయితే ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్లోని ఎమర్జెన్సీ లైట్లు ఆగిపోయాయి. విద్యుత్ పరికరాలు కూడా పనిచేయలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆ రోగికి ఆపరేషన్ నిలిపివేశారు. కరెంట్ రాకకోసం ఎదురుచూశారు. కాగా, ఆ రోగికి ఆపరేషన్ చేస్తున్న బృందంలోని ఒక వైద్యుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న ఈ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఆ రోగికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు.