రామ్ పోతినేనితో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. మాస్, యాక్షన్ని ఇష్టపడే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి ఈ కాంబో రెడీ అవుతోంది. హై బడ్జెట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గురువారం దర్శకుడు పూరి జగన్నాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ పవర్ ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్లో దర్శకుడు, హీరో రామ్, విలన్ సంజయ్ దత్తో కలిసి చేతిలో డబుల్ బ్యారెల్ గన్లు పట్టుకుని కనిపించారు. రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ”ఇస్మార్ట్ శంకర్’కి మించి అనేలా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ తనదైన మార్క్తో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మహా శివరాత్రి కానుకగా మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది’ అని చిత్ర బృందం చెప్పారు.