వైఎస్సార్‌టీపీకి ఉమ్మడి గుర్తు కేటాయించిన ఈసీ

నవతెలంగాణ హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (ysrtp)కి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలని ఆ పార్టీ ఈసీని కోరింది. రిజిస్టర్డ్‌ పార్టీగా ఉన్న వైఎస్సార్‌టీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పేరా10బీ కింద అనుమతిస్తూ ఆ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించింది.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ అభ్యర్థులకు బైనాక్యులర్‌ గుర్తును ఉమ్మడిగా కేటాయించింది. నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్‌ గుర్తును కేటాయించాలని ఈసీ.. రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీ సింబల్స్‌ జాబితాలో బైనాక్యులర్‌ గుర్తు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఒక వేళ పార్టీ కనీసం ఐదుశాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఈసీ తెలిపింది. రాష్ట్రానికి సంబంధించి మరి కొన్ని రిజిస్టర్డ్‌ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది. ఆబాద్‌ పార్టీకి సీసీటీవీ కెమెరా గుర్తును, విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్‌ గుర్తు, జన శంఖారావం పార్టీకి బెండకాయ గుర్తును కేటాయించింది.

Spread the love