– విశ్వసనీయ సమాచారమందింది
– లోక్సభలో నా ‘చక్రవ్యూహం’ ప్రసంగం కొందరికి నచ్చలేదు
– అందుకే ఈ ప్రయత్నాలు సోదాలకు చారు, బిస్కెట్లతో వెయిటింగ్ : ‘ఎక్స్’లో రాహుల్ పోస్ట్
– రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైనం
న్యూఢిల్లీ : లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్(గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తనపై త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరగొచ్చని అందులో రాసుకొచ్చారు. ఈడీ సోదాలపై తనకు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా సమాచారమందిందని ట్వీట్ చేశారు. లోక్సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొంతమందికి నచ్చలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తనపై ఈడీ దాడులు జరగొచ్చని ఆయన ఆరోపించటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ” ఈడీ నాపై సోదాలకు సిద్ధమవుతున్నది. ఈడీలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ అధికారులు నాకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. గత నెల 29న తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం సాధారణంగానే ఇద్దరిలో ఒకరికి నచ్చలేదు. ఈడీ అధికారులను సోదాలకు ఆహ్వానించేందుకు చారు, బిస్కెట్లతో సిద్ధంగా ఉన్నాను” అని రాహుల్ గాంధీ ట్విటర్లో రాసుకొచ్చారు.
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే లోక్సభలో రాహుల్ గాంధీ బడ్జెట్పై ప్రసంగిస్తూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగానే ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలు రెండో శక్తి అని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ శక్తులన్నీ దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని.. అందులో వీరమరణం పొందిన అభిమన్యుడిని కూడా రాహుల్గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్ని కూడా ఆ ఆరుగురు అదే చేయబోతున్నారని.. రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.