డీఎస్సీ దరఖాస్తుదారులకు ఎడిట్‌ ఆప్షన్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌ : నిన్న టెట్‌ 2024 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తులను విద్యాశాఖ అప్రమత్తం చేసింది. టెట్‌ స్కోర్‌తో పాటు ఇతర వివరాలను ఎడిట్‌ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. టెట్‌-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
టెట్‌ పేపర్‌ -1లో 57,725 (67.13%), పేపర్‌ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్‌1కు 85,996 మంది, పేపర్‌2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిరుడు టెట్‌తో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. పేపర్‌ -1లో ఏకంగా 30.24శాతం, పేపర్‌ -2లో 18.88శాతం ఉత్తీర్ణతశాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, అర్హత సాధించని అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం ఇచ్చింది. టెట్‌ -24లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు డిసెంబర్‌ టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. టెట్‌-24లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. టెట్‌ మెమోలను https://schooledu.telangana.gov. in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు.
సర్కారు బడుల్లో టీచర్లుగా పనిచేస్తున్న పలువురు టీచర్లు టెట్‌ పరీక్షను గట్టెక్కలేకపోయారు. తొలిసారిగా రాష్ట్రంలో 33వేలకు మందికిపైగా టీచర్లు టెట్‌ రాశారు. వీరిలో 18వేల మంది (54%) మాత్రమే టెట్‌ క్వాలిఫై అయ్యారు. ఏకంగా 15వేల (46%) మంది టీచర్లు అర్హత సాధించకపోవడం గమనార్హం. సబ్జెక్టులవారీగా చూస్తే అత్యధికంగా పేపర్‌ -2 సోషల్‌లో 56 శాతం టీచర్లు, పేపర్‌ -2 గణితం, సైన్స్‌లో 49 శాతం, పేపర్‌ -1లో మరో 21శాతం టీచర్లు అర్హత సాధించలేదు. టీచర్లు టెట్‌లో క్వాలిఫై కాలేదు. టెట్‌ పరీక్షలను గత మే 20 నుంచి జూన్‌ 2 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

Spread the love