వీధికుక్కల దాడి వృద్ధురాలు మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్: వీధి కుక్కలు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. జీవీఎంసీ 87వ వార్డు అంబేడ్కర్‌ కాలనీలో శాంతమ్మ (70) తన కోడలితో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమె తెల్లవారుజామున లేచి ఇంటి సమీపంలోని రోడ్డుపైకి వచ్చారు. అక్కడ ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. చేయి, తొడ, కాళ్లు, ముఖం తదితర శరీర భాగాలను పీకేయడంతో ఎముకలు బయటకు వచ్చి.. అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదు. ఉదయాన్నే స్థానికులు శాంతమ్మ మృతదేహాన్ని గుర్తించి.. కోడలికి సమాచారం ఇచ్చారు. శాంతమ్మ ఇద్దరు కుమారులు, భర్త గతంలోనే మృతి చెందారు. కోడలు దేవి ఆటోనగర్‌ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుక్కల సమస్యపై జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా, సోమవారం పరిశీలించి చర్యలు తీసుకుంటామని నిర్లక్ష్యంగా బదులిచ్చారని స్థానికులు ఆరోపించారు. గతంలోనూ ఇదే కాలనీలో పలుమార్లు కుక్కలు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి.

Spread the love