నవతెలంగాణ – కర్ణాటక: హసన్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు ఒక్క సారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యారు. హసనాంబ ఆలయం ఏడాదిలో వారం రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఏటా దీపావళికి ఏడు రోజులు ముందు ఆలయాన్ని తెరుస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏటాలాగే ఈ ఏడు కూడా ఆలయంలో నవంబర్ 2వ తేదీ నుంచి వార్షిక హసనాంబ జాతర మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవం నవంబర్ 14తో ముగియనుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ సందర్శనకు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం మధ్యాహ్నం క్యూలో నిల్చున్న సమయంలో విద్యుత్ తీగ తెగి పడటంతో 20 మంది భక్తులు కరెంట్ షాక్కు గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన భక్తులు క్యూ నుంచి బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యారు. వెంటనే స్పందించిన ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని హసన్ ఎస్పీ మహ్మద్ సుజిత తెలిపారు.