ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలి

– బ్యాలెట్ బాక్స్ లను  క్లోజ్ కంటైనర్ లో మాత్రమే పంపాలి
– వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటు 
– కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్  : వరంగల్,ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల  ఉప ఎన్నికల పోలింగ్ కు  సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం,  నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందందన  అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం  ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా, బ్యాలెట్ బాక్సుల సీలింగ్ వాటిని తిరిగి రిసెప్షన్ కేంద్రాల వద్దకు తేవడంలో పాటించాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు. బ్యాలెట్ బాక్సులు సీల్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే స్టిక్కర్లు, ఏజెంట్ల సంతకాలు వంటి అన్నింటిపై వివరంగా తెలియజేశారు.  ప్రతి  పోలింగ్ కేంద్రానికి 50 మంది ఓటర్లకు ఒక  వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ఇవ్వడం జరుగుతుందని, దాని ద్వారానే ఓటరు ఓటు వేసేలా చూడాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను  క్లోజ్ కంటైనర్ లో మాత్రమే నల్గొండకు పంపించాలని కోరారు. ప్రిసైడింగ్ అధికారి డైరీ, ఫారం- 16 లను పరిశీలించేందుకు అన్ని జిల్లాలలో సరిపోయినన్ని బృందాలను ఏర్పాటు చేయాలని, పిఓ డైరీ పూర్తిగా కరెక్టుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రిసెప్షన్ సెంటర్లో అప్పగించాల్సిన డాక్యుమెంట్లు అన్ని పూర్తిగా  అందించేలా చూడాలన్నారు. పోలింగ్ సిబ్బందికి వసతులు, వారి సంక్షేమంపై దృష్టి సారించాలని అన్నారు.ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సమయానికి 48 గంటల ముందు ప్రచారం చేయకూడదనే విషయాన్ని, అలాగే 144 సెక్షన్ విధింపు, పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రింట్ మీడియాలో జారీ చేసే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందిగా రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చే వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి సమయానికి నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చేలా చూడాలని, ఎట్టి పరిస్థితులలో మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వాటిని స్ట్రాంగ్ రూమ్ లో సీల్ చేసే విధంగా సహకరించాలని కోరారు. పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేసేందుకు టీములను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళ, పురుష ఓటర్ల శాతాన్ని వేరువేరుగా పంపించాలని, పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని,  అంతేకాక వాటర్ బాటిల్లు, ఇంక్ పెన్నులు లాంటివి తీసుకురాకుండా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ  అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Spread the love