కూతురును చూడటానికి వచ్చి గుండెపోటుతో తండ్రి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురును చూడడానికి వచ్చిన తండ్రికి గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. దీంతో అంబులెన్స్ లోనే గుండె నొప్పి భరించలేక అతడు విలవిలవిల్లాడిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేస్తూ అతడిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ రైలు వెళ్లిపోయి గేటు ఎత్తే సమయానికి అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన విజయ్, సుధీవన భార్యాభర్తలు.. అయితే వీరి కూతురు స్పందన పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. నిన్న రెండో శనివారం సెలవురోజు కావడంతో కూతురిని చూసేందుకు విజయ్ దంపతులు మల్లాపూర్ కు వెళ్లారు.. కూతురితో మాట్లాడుతుండగా విజయ్ కు ఒక్కసారిగా హార్డ్ ఎటాక్ వచ్చింది. దీంతో స్కూల్ సిబ్బంది సాయంతో అతడిని భార్య సుధీవన అంబులెన్స్ లో తరలించింది. అయితే రైలు వస్తుండటంతో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వేయడంతో అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది. ఆ అంబులెన్స్ అక్కడే దాదాపు 15నిమిషాల పాటు ఆగిపోవడంతో విజయ్ పరిస్థితి విషమించి మరణించాడు. కొద్దిసేపట్లో ఆస్పత్రికి వెళ్తారనగా రైలు గేటు పడటంతో విజయ్ కు టైంకి చికిత్స అందకపోవడంతో చనిపోయాడు.

Spread the love