– మద్దతు ధర చెల్లించాలి
– ధóరల స్థిరీకరణకు ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి
– పంటలు, ఎరువులు, పురుగుమందులపై జీఎస్టీ రద్దుకు డిమాండ్
– వ్యవసాయ రంగం గురించి పట్టని మోడీ ప్రభుత్వం
– తెలంగాణ రైతుసంఘం మహాధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు పోతినేని, రాష్ట్ర నాయకులు నున్నా
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మిర్చిని వ్యాపార పంటగా కాకుండా ఆహారపంటగా గుర్తించాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మిర్చికి రూ.25వేల గిట్టుబాటు ధర చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా రూ.25వేలకు కొనుగోలు చేయాలన్నారు. రైతులు చనిపోతున్నా మిర్చి ధరలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి వ్యవసాయ రంగం గురించి పట్టదని, రాష్ట్రంలో ఇద్దరు కేంద్రమంత్రులు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్రమంత్రులు ఉండి ఏమి ఉపయోగమని అన్నారు. గతంలో వామపక్షాల భాగస్వామ్యంతో పనిచేసిన యూపీఏ ప్రభుత్వం మిర్చికి 10శాతం కంటే ధర తగ్గినప్పుడు గిట్టుబాటు ధర కోసం చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం పంటలు, ఎరువులు, పురుగుమందులపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. మిర్చి రైతులు పురుగుమందులపై రూ.50వేల పెట్టుబడి పెడితే 18శాతం జీఎస్టీ పేరుతో రూ.9వేలు పన్ను కట్టాల్సి వస్తోందన్నారు. పంటలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, ఎరువులపై 10-30శాతం పన్నులు, డీజిల్, పెట్రోల్పై కమీషన్లు దండుకుంటున్న కేంద్రప్రభుత్వం మిర్చి పంట ధరను మాత్రం 60శాతం తగ్గించిందని ఆరోపించారు. రైతులు పోరాటాలను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. అనంతరం నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ సీజన్లో ఇప్పటికీ రెండుసార్లు మిర్చి ధరల పెంపుపై ఆందోళనలు చేశామని తెలిపారు. మిర్చి రైతులు మరణిస్తున్నారని, ఇప్పటికీ జిల్లాలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇకనైనా స్పందించకపోతే మిర్చి రైతులతో మంత్రుల ఇండ్లు, క్యాంప్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. వివిధ రకాల తెగుళ్లకు రైతు ఒక్కసారి పురుగు మందు కొడితే ఎకరానికి రూ.2వేలకుపైగా ఖర్చు వస్తుందని, అలాంటిది సీజన్కు 20 సార్లకు పైగా పిచికారీ చేయాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటుకు ఎంపీ రఘురాంరెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, నాయకులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావ్, తాతా భాస్కర్రావు, కొక్కెర పుల్లయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, మహేశ్వరరెడ్డి, ఎస్.నవీన్రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, ఊరడి సుదర్శన్రెడ్డి, కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.