పనిలో మునిగిపోయి సమయానికి అల్పాహారం, భోజనం వంటివి తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదు. ఒకవేళ పని ఒత్తిడిలో కొన్నిసార్లు తినడం కుదరకున్నా ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అల్పాహారం, భోజనం చేయడం కుదరని పక్షంలో కనీసం కొన్ని రకాల పండ్లనైనా తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల పొట్ట ఖాళీగా ఉండకుండా ఉంటుంది, తక్షణ శక్తి అందుతుంది. అవేంటో చూద్దాం…
అరటి : శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇందులో ఉన్నాయి. మలబద్ధకం ఉన్నవాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు.
ఆపిల్ : రోజుకో ఆపిల్ పండు తింటే డాక్టరుకు దూరంగా ఉండొచ్చు అని అంటుంటారు. దీనిలో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు ఎక్కువే. చక్కెర శాతం తక్కువ. దీన్ని మధుమేహులు కూడా తినవచ్చు. దీనిలో శక్తినిచ్చే పదార్థమే కాకుండా పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి.
ఆరెంజ్ : వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీర సౌందర్యానికి కూడా చాలా మంచిది. పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయిన కండరాలకు, గుండెకు మేలు చేస్తుంది. దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణప్రక్రియకు, మలబద్ధకం నివారించేందుకు చాలా ఉపయోగపడుతుంది.
బొప్పాయి : బొప్పాయిలో ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మధుమేహులు కూడా తీసుకోవచ్చు. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.
పైనాపిల్ : ఎనర్జీని అందించడంలో మరో అద్భుతమైన పండు. అంతేకాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ను పెంచుతుంది.
మామిడి : విటమిన్ ఎ, బీటాకెరోటిన్, బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, రోగనిరోధక శక్తి ఎక్కువ చేసే యాంటి ఆక్సిడెంట్లు ఉన్నాయి. శక్తిని వెంటనే అందజేస్తుంది. దీనిలో పీచు (ఫైబర్) ఉండడం వల్ల, రక్త ప్రసరణకు, సాఫీగా విరేచనం కావడానికి తోడ్పడుతుంది.
పుచ్చకాయ : దీనిలోని పీచు పదార్థం జీర్ణప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. విటమిన్ సి, ఎ, ఐరన్, పొటాషియం, ఒక రకమైన తీపి పదార్థం ఉండడం వల్ల శక్తినిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.