చెట్టును ఢీ కొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాన్పూర్‌ దెహత్‌ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్‌, నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Spread the love