వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

Four people died in different road accidents– ఇద్దరికి తీవ్ర గాయాలు
– నల్లగొండ జిల్లా పానగల్‌ బైపాస్‌ వద్ద, యాదాద్రి జిల్లా దండుమల్కాపురంలో ఘటనలు
నవతెలంగాణ-నల్లగొండక్లాక్‌టవర్‌ /చౌటుప్పల్‌రూరల్‌
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటనలు బుధవారం నల్లగొండ జిల్లా పానగల్‌ బైపాస్‌వద్ద, యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద జరిగాయి. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్‌ బైపాస్‌ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు నుండి ఢిల్లీకి మందుల లోడుతో వెళ్తున్న యూపీ77ఏ 9602 ఐచర్‌ వాహనం పానగల్‌ ఫ్లైఓవర్‌ వద్ద కిందికి దిగే సమయంలో ముందుగా వెళుతున్న లారీ సడన్‌ బ్రేక్‌ వేశారు. దాంతో ఐచర్‌ వాహనం అదుపుతప్పి లారీని వెనుక నుంచి బలంగా ఢ కొట్టింది. ప్రమాదంలో ఐచర్‌ వాహనం డ్రైవర్‌ అభిదేవ్‌ (40), క్లీనర్‌ రాజీవ్‌ (39) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఇద్దరిదీ ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం. ఘటనా స్థలాన్ని టూ టౌన్‌ సీఐ రాఘవరావు, ఎస్‌ఐ నాగరాజు సందర్శించి అతి కష్టం మీద క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ మన్మథకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి సాయికుమార్‌(33) తన కుటుంబ సభ్యులుతో కలిసి కారులో సూర్యాపేటకు బయల్దేరారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్దకు రాగానే హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢకొీట్టి సూర్యాపేటకు వెళ్తున్న కారును ఢకొీట్టింది. ఈ ఘటనలో సాయికుమార్‌తో పాటు తన ఐదు నెలల కుమారుడు వీరాన్ష్‌కు కూడా తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌కు వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love