పట్టణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

నవతెలంగాణ-ఆర్మూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ,  అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను  నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు గోర్తా రాజేందర్ ,ఆర్టీసీ  డిప్యూటీ ఆర్ ఎం సరస్వతి , ఏసిపి  జగదీష్ చందర్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు.. డిపో,బస్సు స్టాండ్ లో మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుకు పచ్చ జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి  ఆర్టీసీ బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా,పాత బస్టాండ్, మామిడి పల్లి చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు సైతం బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో ఫేర్ తో కూడిన మహాలక్ష్మి టికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడం పట్ల మహిళలు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రయాణ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన సందర్భంగా  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి   మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలల్లోనే రెండు పథకాలను అమలు చేసిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ప్రభుత్వం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచిందని, ప్రతి నిరుపేద కుటుంబానికి సాలీనా పది లక్షల రూపాయల వరకు విలువ చేసే వైద్య సేవలను ఈ పథకం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా,ఆర్మూర్ లోని అర్హులైన ప్రతి కుటుంబానికి పరిమితి పెంపుతో కూడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్  బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు, బాలికలు, యువతులు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత రవాణా వసతి వర్తిస్తుందని తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలెక్షన్ ఐ.డీ వంటి ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని అన్నారు. అనంతరం సోనియమ్మకు,రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సోనియమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ , సిబ్బంది ఎన్ వి రెడ్డి,చక్రవర్తి, డ్రైవర్ రెడ్డి, కండక్టర్ రాధా,కాంగ్రెస్ నాయకులు ,సాయి బాబా గౌడ్,రవి ప్రకాష్,కోలా వెంకటేష్,కొంతం మంజుల మురళి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు,బాలికలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినిలకు ఎంతో సౌకర్యం..
గ్రామీణ దూర ప్రాంతాల నుండి పట్టణాలకు చదువు కొనడానికి వచ్చే విద్యార్థినులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది .మధ్యతరగతి కుటుంబీకులకు ఎంతో ఉపయోగం. పాఠశాలల, కళాశాలల సమయ వేళల్లో బస్సులు నడపాలి. ….మేఘన ,విద్యార్థిని, స్థానికురాలు.
Spread the love