ఎంసెట్‌లో అమ్మాయిలదే ఆధిక్యం

– ర్యాంకర్లలో అబ్బాయిలు టాప్‌
– ఆంధ్ర విద్యార్థుల హవా
– ఇంజినీరింగ్‌లో అనిరుధ్‌, అగ్రికల్చర్‌లో జశ్వంత్‌ ప్రథమం

– ఇంజినీరింగ్‌లో 80 శాతం,అగ్రికల్చర్‌లో 86 శాతం అర్హత
– 2,3 రోజుల్లో
ఇంజినీరింగ్‌ ప్రవేశాల షెడ్యూల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎంసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలు ఆధిక్యతను ప్రదర్శిం చారు. అటు ఇంజినీరింగ్‌, ఇటు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగా ల్లోనూ ఎక్కువ మంది అమ్మాయిలే అర్హత సాధించారు. అయితే టాప్‌ ర్యాంకర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో ఎనిమిది మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో ఏడుగురు అబ్బాయిలు న్నారు. టాప్‌ ర్యాంకర్లలో ఆంధ్ర విద్యార్థులు హవా కొన సాగించారు. ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్‌ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌ విభాగానికి 2,05,351 మంది దరఖాస్తు చేస్తే, 1,95,275 మంది పరీక్ష రాశారు. వారిలో 1,56,879 (80.34 శాతం) మంది అర్హత సాధించారు. ఇందులో 80,672 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 76,536 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 62,814 (82.07 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 1,24,679 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 1,18,739 మంది పరీక్ష రాశారు. వారిలో 94,065 (79.22 శాతం) మంది అర్హత పొందారు. అంటే ఇంజినీరింగ్‌ విభాగంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.85 శాతం అధికంగా ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగానికి 1,15,332 మంది దరఖాస్తు చేయగా, 1,06,514 మంది పరీక్ష రాశారు. వారిలో 91,935 (86.31 శాతం) మంది అర్హత సాధించారు. ఇందులో 81,205 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 74,881 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 65,163 (87.02 శాతం) మంది అర్హత పొందారు. 34,127 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 31,633 మంది పరీక్ష రాశారు. వారిలో 26,772 (84.63 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.39 శాతం అధికంగా అర్హత పొందారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. 2022లో ఇంజినీరింగ్‌ విభాగంలో 80.42 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగంలో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే ఇంజినీరింగ్‌లో 0.08 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 2.03 శాతం తగ్గడం గమనార్హం.
2,3 రోజుల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల షెడ్యూల్‌ : సబిత
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశా లకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఎంసెట్‌, సివిల్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభి నందనలు ప్రకటించారు. ఉత్తీర్ణులు కాని వారు ఆందోళన చెందొద్దని, మళ్లీ ప్రయత్నించాలని కోరారు. ఎంసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సహకరించిన ఇతర శాఖల అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకే తిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్‌ ఎ గోవర్ధన్‌, రిజిస్ట్రార్‌ ఎం మంజూర్‌ హుస్సేన్‌, ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love