– రాష్ట్రాన్ని ఆ దిశగా తీర్చిదిద్దుతాం : జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సాంకేతికతను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దీనికోసం జపాన్ కంపెనీ యమానాషీ సహకారాన్ని తీసుకుంటామన్నారు. భవిష్యత్లో థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి ఉందనీ, దానికోసం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జపాన్లోని టోక్యో నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. అక్కడి సైంటిస్టులు, నిర్వహకులతో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉత్పత్తి ప్రక్రియ, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలపై చర్చించారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎమ్డీ ఎన్ బలరాం తదితరులు ఉన్నారు. సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ నీటిని ఎలక్ట్రోలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడగొట్టే యంత్రభాగాలను యమానాషి కంపెనీ రూపొందిస్తోంది. ఈ విధంగా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేలా వినియోగిస్తున్నారని అక్కడి నిర్వాహక ఇంజినీర్ కునిగి వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో థర్మల్ విద్యుత్ను కాకుండా సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నామనీ, అందుకే దాన్ని గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తున్నామని తెలిపారు. ఈ తరహా ప్లాంట్లను రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో నీటి వసతి, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు విస్తారంగా ఉన్నందున గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్ ఎరువుల కర్మాగారాలు, ఆర్టీసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయోచ్చన్నారు. అలాగే సోలార్ ప్లాంట్లలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బిఇఎస్ఎస్) తయారీ విభాగాన్ని కూడా డిప్యూటీ సీఎం బృందం పరిశీలించింది. పగటిపూట ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను నిల్వ చేసేందుకు ఈ బ్యాటరీలు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ తరహా సాంకేతికత లేనందున సోలార్ మిగులు విద్యుత్ వృధా అవుతున్నదని ఆయన చెప్పారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు, త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా యమానాషీ సంస్థ అధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం సాంకేతికత వినియోగంపై ఉమ్మడి భాగస్వామ్యంతో ప్లాంట్ల నిర్మాణం కోసం కలిసి రావాలని కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.
షిబుయా క్రాసింగ్ తరహాలో జంక్షన్ల అభివృద్ధి
టోక్యో నగరంలోని షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమనీ, హైదరాబాద్లో కూడా ఆ తరహా జంక్షన్లను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూడు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడాయన టోక్యో నగరంలో హచుకో రైల్వేస్టేషన్ దగ్గరి షిబుయా క్రాసింగ్ను సందర్శించారు. ఒకేసారి మూడువేల మంది బాటసారులు ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్లు దాటడానికి చేసిన ఏర్పాటును ఆయన పరిశీలించారు. రోజుకు కనీసం 5 లక్షల మంది పాదచారులు ఒక్క చిన్న ప్రమాదం జరగకుండా ఈ రైల్వే మరియు రోడ్డు కూడలి నుండి దాటుతుంటారని, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రక్షణతో కూడిన పాదచారుల క్రాసింగ్ అని ఆయన ప్రశంసించారు. హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలుచేస్తామన్నారు. షిబుయా క్రాసింగ్ వద్ద భారత ఎంబసీ అధికారులు అక్కడ వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను డిప్యూటీ సీఎం బృందానికి వివరించారు.