వ్యవస్థలు వ్యక్తుల మీద పగ పడతాయా? ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానమనే భావనా, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించే ఆ వ్యవస్థలో న్యాయం అందరికీ సమానంగానే వర్తిస్తుందనీ, చట్టం ముందు అందరూ సమానులేననీ తరచూ వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇవి రాసుకున్న ఆదర్శాలు మాత్రమేనన్న విషయం బోధపడుతూ ఉంటుంది. కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలూ, తారతమ్యాలూ, హెచ్చుతగ్గులూ ఒకటేంటి సమాజంలో ఉండే అన్ని రుగ్మతలూ షరతులు లేకుండా యదేచ్ఛగా వర్ధిల్లడం అనుభవంలో ఉన్నదే.
2017 ఆగస్టులో ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో అలక్ష్యం కారణంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి 60 మంది శిశువులు మరణించటంలోని వ్యవస్థ నిర్వాకాన్ని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది. దోషులంతా ఎంచక్కా బయట తిరుగుతుంటే, పసిబిడ్డల ప్రాణాలను కాపాడటానికి తన వంతు కర్తవ్యంగా చేయగలిగిందంతా చేసిన డాక్టర్ కఫీల్ ఖాన్ ఎందుకు నిర్దాక్షిణ్యంగా శిక్షకు గురై సర్వం కోల్పోయి, నిస్సహాయంగా న్యాయం కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితుల వెనక జరిగిన ఘోరాన్ని ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది.
ఏ.ఈ.ఎస్ అనే మెదడువాపు వ్యాధి 1978 తర్వాత 25 వేల మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు లక్ష మందిని శాశ్వత అంగవికలురుగా చేసింది. పేదరికం, సురక్షితమైన మంచినీటి సౌకర్యం, పోషణ లోపాలు, అపరిశుభ్రత, టీకా వేసుకోకపోవడం వల్ల వచ్చే ఈ వ్యాధిని కొంచెం చిత్తశుద్ధితో పనిచేస్తూ, టీకా డ్రైవ్ను కూడా నిర్వర్తిస్తే ప్రతి సంవత్సరం లక్షలాది పసిబిడ్డల ప్రాణాలు కాపాడబడతాయి. కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో చాలా రొటీన్గా పసిబిడ్డలు చచ్చిపోతుంటారు. వారికి ఆక్సిజన్ అవసరమవుతూ ఉంటుంది. ఆక్సిజన్ సప్లైదారులతో కుమ్ముకై ఆక్సిజన్ ప్లాంటేషన్స్ను వ్యాపార స్థాయికి దిగజార్చి, ప్రాణాలు పోయడానికి బదులు, పసిబిడ్డల ప్రాణాల్ని ఫణంగా ఎందుకు పెట్టారో తెలియాలంటే ఈ పుస్తకం చదివి తీరాలి.
డాక్టర్ కఫీల్ఖాన్ ఈ వికత చదరంగంలో ఒక పావుగా ఎందుకు శిక్ష అనుభవించాల్సి వచ్చిందో తెలుసుకుంటే అసలు సిసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయాన్యాయాల తాలూకూ డొల్లతనం తేటతెల్లమవుతుంది. ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఢ కొనటం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు మంచి చేస్తున్నారా హాని చేస్తున్నారా అనేది ఈ వ్యవస్థకు అక్కర్లేదు. వ్యవస్థకు ఎదురు నిలబడితే సహించే పరిస్థితి ఉండదు. గురువుల్ని ప్రశ్నించే విద్యార్థీ, యాజమాన్యాన్ని ప్రశ్నించే కార్మికుడూ, వ్యవస్థను ప్రశ్నించే ఉద్యోగీ తాము న్యాయంగానే, చట్టబద్ధంగానే ప్రశ్నిస్తున్నామని చెప్పినంత మాత్రాన, ”అయ్యో పాపం నిజమే కదా!” అంటూ అవి నిమ్మళించవు. అవకాశం కోసం కాచుకు కూచుంటాయి. దీనికి మతం రంగు తోడైతే అదెంత ఘోరంగా ఉంటుందో డాక్టర్ కఫీల్ఖాన్ పుస్తకం చూపిస్తుంది.
డాక్టర్ కఫీల్ఖాన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తారు. ఆగస్టు 10 అర్ధరాత్రి రోజు ఆయన ఒక ఫోన్ రిసీవ్ చేసుకుంటారు, ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అయిపోయిందని. పిల్లల వార్డులో అప్పటికే ఆక్సిజన్ మీద వైద్యం జరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా గుండె గుభిల్లుమంటుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఏం చేయాలో తోచక పై అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు సరిగ్గా సమాధానం ఇవ్వక జూనియర్ డాక్టర్లతో, ఇతర సిబ్బంది సాయంతో 500 సిలిండర్లను పోగుచేసి బిడ్డల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ఆరోజు 60 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతారు.
అసలెందుకీ కొరత ఏర్పడింది? అలక్ష్యం ఎక్కడ జరిగింది? పసిబిడ్డల ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన విషాదం వెనుక సందర్భాలేమిటి? దీని వెనుకున్న కుట్ర కోణం ఏమిటి, ఈ ఆక్సిజన్ ప్లాంట్ టెండర్లు దక్కించుకోవడంలో రాజకీయ శక్తుల ప్రమేయాలేమిటో ఈ పుస్తకం నగంగా చూపుతుంది. అలక్ష్యాన్ని ప్రశ్నించారన్న కారణంగా డాక్టర్ కఫీల్ఖాన్ను టార్గెట్ చేయడమూ, వారి కుటుంబాన్ని వేధించడమూ, వారి ఆస్తులను ధ్వంసం చేయడమూ, వారి వ్యాపారాలని నాశనం చేయడమూ, కుటుంబ సభ్యుల్లో ఒకరిపై కాల్పులు జరపడమూ, ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు వెంటాడటమూ, జైల్లో సాధారణ ఖైదీగా ఘోరమైన జీవితాన్ని చవి చూపించడమూ, నెలల తరబడి జైల్లో మగ్గేలా చేయడమూ లాంటి హదయం చలించిపోయే అనేక ఉదంతాల గురించి చెప్పి కంటతడి పెట్టిస్తుందీ పుస్తకం.
ఇది పసిబిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల విషాదమే కాదు, కఫీల్ఖాన్ స్వయంగానూ, తన కుటుంబం ఎదుర్కొన్న ఒక అమానుషమైన, నిరంతర చిత్రవధకూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పుస్తకం చదివినంత సేపూ గుండెలుపిండే వేదన. అనేకసార్లు కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలక్ష్యం పట్ల ఆగ్రహవేశాలు కలుగుతాయి.
ఉద్యోగం కోల్పోయినా, కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాల్ని విధ్వంసం చేస్తున్నా, నిరంతరం వెంటాడుతూ, వేధిస్తున్నా, వాళ్లు ప్రాణభయంతో విలవిలలాడిపోతున్నా ఏమీ చేయలేని తన అశక్తతని గుండెల్లో దిగమింగుకొని, ఎన్ని ఆటుపోటులెదురైనా ధైర్యంగా ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, ప్రజా మద్దతును కూడగట్టుకుంటూనే, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే, డాక్టర్ కఫీల్ఖాన్ మానవీయ కోణంతో దేశవ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ రావడం అత్యంత శ్లాఘనీయం. పోతే పోనీ, హితుల్ సుతుల్, వస్తే రానీ కష్టాల్ నష్టాల్ అనుకుంటూ ముందుకెళ్ళిపోతున్న డాక్టర్ కఫీల్ఖాన్ ధైర్యాన్నీ, వారి న్యాయ పోరాటాన్నీ ఈ పుస్తకం చదివిన తర్వాత అభినందించకుండా ఉండలేరు.
– వి.విజయకుమార్