నవతెలంగాణ – ముంబయి : ముంబయిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స రఫరా కూడా నిలిచిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. జూన్ 14 నుండి 19 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయని పశ్చిమ రైల్వే పేర్కొంది. ట్రాక్లను వరదలు ముంచెత్తకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దక్షిణ ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూలేశ్వర్, కల్బాదేవీ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కి ఫోన్ చేసినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.