హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

నవతెలంగాణ – చౌటుప్పల్‌: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం క్రాస్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి వస్తున్నది. అంతేకాకుండా చౌటుప్పల్‌ బస్టాండ్ వద్ద క్రాసింగ్ మార్గాన్ని కూడా కొద్దిసేపు మూసివేశారు. దీంతో స్థానిక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంక్రాతికి పట్నవాసులు పల్లె బాటపట్టడంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై (ఎన్‌హెచ్‌ 65) వాహనాలు క్యూకట్టాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్‌ప్లాజాలో మొత్తం 18 టోల్‌ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు.

Spread the love