నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులు జరపడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నగరంలో బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులు జరపడం పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీఓ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తెలిపింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్.. ఆయా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది కొంత సమయం కోరారు. అయితే తదుపరి విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.