నగర ప్రజలకు నిరంతర సేవలు అందించేందుకు ‘హైడ్రా’ ప్రత్యేక విభాగం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్‌ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం పురపాలకశాఖ, హెచ్‌ఎండీఏ, మూసీ పరీవాహక అభివృద్ధి ప్రాజెక్టు(ఎంఆర్‌డీపీ) అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్‌ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధినీ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామపంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలన్నారు. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా ఉండేలా చూడాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలన్నారు. ‘‘వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందించేలా విపత్తుల నిర్వహణ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను చేపట్టాలి. హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలోనూ సేవలందించాలి. అందుకు వీలుగా అదనపు సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదాను సిద్ధం చేయాలి’’ అని సీఎస్‌ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్‌ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా అబ్జర్వేటరీ, గుడిమల్కాపూర్‌ కోనేరు లాంటి చారిత్రక ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలన్నారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని.. అందులోనే జోడించాలన్నారు. సీఎస్‌ శాంతికుమారి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విపత్తు నిర్వహణ కమిషనర్‌ ఏవీ రంగనాథ్, హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love