నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్కు దమ్ముంటే ఒక్క సీటైనా గెలవాలని ఈ మధ్య రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని… అక్కడా ఇక్కడా ఎందుకు? ఆయన సిట్టింగ్ మల్కాజ్గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని తాను చెబితే ఉలుకుపలుకు లేదని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని… ఆయనకు దమ్ముంటే చెప్పాలని… పోటీ పడదామన్నారు. ఆయనకు నరుకుడు… ఉరుకుడు తప్ప ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అసలు రేవంత్ రెడ్డి… మోడీ మనిషా? లేక రాహుల్ గాంధీ మనిషా? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి వేసే ప్రతి ఓటు మోడీకి వేసినట్లే అవుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.