అమెరికాలో భారత సంతతి వ్యాపారులకు జైలు శిక్ష..

నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్‌ మోసాలకు పాల్పడినట్లు ఈసందర్భంగా న్యాయస్థానం తెలిపింది. ఔట్‌కమ్‌ హెల్త్‌ పేరిట రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌లు ఓ హెల్త్‌ మీడియా సంస్థను 2006లో ఏర్పాటుచేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో పేషెంట్లను టార్గెట్‌ చేసుకొని వివిధ కంపెనీల మెడికల్‌ అడ్వర్టైజింగ్‌ ప్రకటనలు ప్రసారం చేసేది. ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి కాంట్రాక్టులు లభించాయి. 2010లో ఆ దేశ టెక్‌, హెల్త్‌కేర్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో భారీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. గోల్డ్‌మన్‌ సాక్స్‌, ఆల్ఫాబెట్‌, జేబీ ప్యాట్రిక్స్‌ వెంచర్‌ క్యాపిటల్స్‌ వంటి సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు చేశాయి. కానీ, రిషి, శ్రద్ధా, సీఎఫ్‌వో బ్రాడ్ పౌర్డీలు కంపెనీ ఆపరేషనల్‌, ఫైనాన్షియల్‌ కార్యకలాపాలను పెంచి చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ 2017లో కథనం ప్రచురించింది. ఆ తర్వాత గోల్డ్‌మన్‌ సాక్స్‌, ఆల్ఫాబెట్‌ వంటి ఇన్వెస్టర్లు కోర్టులో కేసు ఫైల్‌ చేశారు. షాపై 2023 ఏప్రిల్‌లో డజను కౌంట్స్‌కుపైగా మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. మిగిలిన ఇద్దరిని కూడా దీనిలో భాగస్వాములను చేశారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం జూన్‌ 26 నుంచి షాకు ఏడేళ్ల ఆరు నెలలు, జూన్‌ 30 నుంచి శ్రద్ధాకు మూడేళ్ల హాఫ్‌వే హౌస్‌లో ఉండేలా, పౌర్డీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. మరోవైపు తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు షా తన నేరం అంగీకారంలో వెల్లడించాడు.

Spread the love