నవతెలంగాణ- న్యూఢిల్లీ: దేశ ప్రజల శక్తి, నైపుణ్యాల కారణంగానే ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్ మెరుగైన స్థానానికి చేరుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్’ పేరుతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ దేశాల వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసింది.
ఐఎంఎఫ్ అంచనా..
భారత్ వృద్ధి రేటు అంచనా 6.3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పేర్కొంది. ఇటీవల భారత్ వృద్ధి రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 శాతంగా పేర్కొంది. దానికి 0.2 శాతం తగ్గించి 6.3గా ఐఎంఎఫ్ అంచనా వేసింది. గత జులైలో భారత్ వఅద్ధి రేటును 6.1 శాతంగా ఐఎంఎఫ్ పేర్కొనడం గమనార్హం. ఈసారి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా వృద్ధి రేటు భారత్ కంటే తక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆ దేశంలో నెలకొన్న స్థిరాస్తి విపణి సంక్షోభం కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్లు ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రధాని మోడీ ట్వీట్..
ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ అంచనాలను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ” దేశ ప్రజల శక్తి, నైపుణ్యాల కారణంగానే అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి, ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా నిలుస్తోంది. సుసంపన్నమైన భారత్ను సాధించే దిశగా మన ప్రయాణాన్ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుదాం. మన సంస్కరణలను మరింత పెంచుదాం ” అని ప్రధాని పేర్కొన్నారు.