నవతెలంగాణ – హైదరాబాద్
పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలకు చెక్ పెట్టింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 11 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్(52) సుడిగాలి ఇన్నింగ్స్తో భయపెట్టినా బుమ్రా, హార్దిక్ పాండ్యా(0)లు మ్యాచ్ను మలుపుతిప్పారు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా భారత్కు 7 వికెట్ల విజయాన్ని అందించాడు. అంతే.. చోకర్స్ ముద్ర పడిన దక్షిణాఫ్రికా ఒత్తిడిని జయించలేక ట్రోఫీ చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగాడు. క్వింటన్ డికాక్ (39; 31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), స్టబ్స్ (31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య (3/20), బుమ్రా (2/18), అర్ష్దీప్ సింగ్ (2/20) అదరగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.