నవతెలంగాణ – హైదరాబాద్: ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్ అయిన ఓ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నానగర్లో నివాసముంటున్న ఎల్లయ్య కుమార్తె రిషిక(18) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. సప్లిమెంటరీ రాసింది. సోమవారం పరీక్ష ఫలితాలు వచ్చాయి. రిషిక రెండు సబ్జెక్టులు పాసై ఒక సబ్జెక్టు ఫెయిల్ అవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు రిషిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.