– వెనుకబడిన జిల్లాలకు రూ.1,800 కోట్ల పెండింగ్ నిధులు తక్షణమే విడుదల చేయాలి
– ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం రూ.408 కోట్లు
– ఏపీ నుంచి ఇప్పించాలి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,800 కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో పార్టీ ఎంపీలతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుపై చర్చించారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదల చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన అంశాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా 2019-20, 2021-22, 2022-23, 2023-24 పైనాన్షియల్ ఇయర్లకు సంబంధించిన గ్రాంటు ఇప్పటి వరకు విడుదల కాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నాలుగేండ్లకు కలిపి పెండింగ్లో ఉన్న మొత్తం రూ.1,800 కోట్ల గ్రాంటును తక్షణమే విడుదల చేయాలని కోరారు.
అలాగే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకైన రూ.703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని, అందులో ఏపీ వాటా రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఆ మొత్తం చెల్లింపునకు ఏపీ సమ్మతించిందని, కేంద్ర హౌం శాఖ సైతం ఆ మొత్తం తెలంగాణకు చెల్లించాలని ఏపీకి లేఖలు రాసిందని సీఎం వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏపీ ఆ మొత్తాన్ని తెలంగాణకు చెల్లించ లేదని, రూ.408.49 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఈ విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులన్నింటినీ 2014-15లో కేవలం ఏపీకే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని నిర్మలా సీతారామన్కు సీఎం గుర్తు చేశారు. విభజన చట్టంలోని జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. అకౌంటెంట్ జనరల్, ఏపీ ప్రభుత్వానికి తాము పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ మొత్తాన్ని తెలంగాణకు సర్దుబాటు చేయడం లేదని కేంద్ర మంత్రి నోటీసుకు తెచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.