సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సిరియా రాజధాని డమాస్కస్‌, దాని శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడులను ఉద్ధృతం చేసింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి బంకర్లు ఉన్నట్లు సిరియా సైనిక వర్గాలు వెల్లడించాయి. పర్వతాల దిగువన ఏర్పాటు చేసిన బంకర్లలోని రాకెట్లను, ఆయుధసామగ్రిని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్‌) ధ్వంసం చేసిందని బ్రిటన్‌ కేంద్రంగా పని చేస్తున్న సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్ రైట్స్‌ (ఎస్‌ఓహెచ్‌ఆర్‌) స్పష్టం చేసింది. అంతేకాకుండా పర్వతసానువుల్లోని సొరంగాలను, ఆయుధ డిపోలను, బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్లను కూడా ఐడీఎఫ్ బలగాలు నాశనం చేశాయని ఎస్‌ఓహెచ్ఆర్‌ వెల్లడించింది. డమాస్కస్‌కు ఉత్తరంగా ఉన్న బార్జేలోని మిలటరీ శాస్త్రసాంకేతిక విభాగాలకు చెందిన సామగ్రిని కూడా ఐడీఎఫ్‌ నాశనం చేసినట్లు పేర్కొంది. గతంలో ఇజ్రాయెల్‌పైకి సిరియా కెమికల్‌ ఆయుధాలను ప్రయోగించింది. అధ్యక్షుడు బషర్ అల్‌ అసద్‌ దేశం విడిచి పారిపోయిన తరుణంలో ఇదే సరైన సమయమని భావించిన ఇజ్రాయెల్‌ ఆ దేశంపై దాడికి దిగింది. తమకు నష్టం కలిగించేలా వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉన్న సిరియా యుద్ధ సామగ్రిని, మిలటరీ వ్యవస్థను సమూలంగా నాశనం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు సైన్యానికి ఇజ్రాయెల్‌ పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది. అవసరమైతే అక్కడ కొన్నాళ్లపాటు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిరియా సైనిక స్థావరాలే లక్ష్యంగా 350 సార్లు దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ ధ్రువీకరించింది. మరోవైపు రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో బఫర్‌ జోన్‌ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌కు ఐక్యరాజ్యసమితి సూచించింది.

Spread the love