నవతెలంగాణ – హైదరాబాద్
చంద్రయాన్-3 మిషన్లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది. అలాగే చంద్రుడిపై సల్ఫర్ నిక్షేపాలు కూడా భారీగానే ఉన్నాయని తొలిసారిగా కనుగొన్నది. ఆక్సిజన్, సల్ఫర్ మాత్రమే కాకుండా పలు ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O) ఉన్నాయని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. జాబిల్లిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ ( లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్ రోవర్కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్ ఆనవాళ్ల కోసం కూడా ఆన్వేషణ కొనసాగుతుందని ఇస్రో తెలిపింది. ప్రజ్ఞాస్ రోవర్లో అమర్చిన లిబ్స్ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డెవలప్ చేసిందని పేర్కొంది.