తమిళనాడు మంత్రి ఇంటిపై రెండోరోజు కొనసాగుతున్న ఐటీ దాడులు

నవతెలంగాణ – హైదరాబాద్
తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్‌ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్‌ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరూర్‌, చెన్నై, కోయంబత్తూర్‌ల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. టాస్మాక్‌ అవుట్‌లెట్లలో అవకతవకలు జరిగాయని ఏఐఏడీఎంకే, బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మంత్రి సెంథిల్‌తో పాటు అతని సన్నిహితుల ఇండ్లలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్ర వరకు ఐటీ తనిఖీలు జరిగాయి. అయితే కక్షపూరితంగా దాడులకు పాల్పడుతున్నారని ఐటీ అధికారులను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికారుల కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో శనివారం నాడు ఐటీ అధికారులకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించడం గమనార్హం.

Spread the love