– ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు మహా కుంబాభిషేకం : రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్
– మేలో నిర్వహించే సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష
నవతెలంగాణ-మహదేవపూర్
కాళేశ్వరం పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పుష్కరాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ అన్నారు. వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే మహా కుంబాభిషేకానికి అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద ఫిబ్రవరిలో మహాకుంబాభిషేకం, మేలో సరస్వతీ పుష్కరాలు ఉన్నందున ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో కాళేేశ్వరంలోని ఈఓ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుంబాభిషేకానికి రాజగోపురంపై ఒకేసారి 20మంది వరకు నిల్చోడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. మేలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలకు 19 లైన్ డిపార్ట్మెంట్ల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి, ఇతర జిల్లాల నుంచి రోజుకు 50వేల మందికిపైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, వన్ వే రూట్ ఏర్పాటు చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ద్వారా అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, రూరల్ వాటర్ శాఖ ద్వారా సురక్షిత మంచి నీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరి నది పరిసరాల్లో మహిళల కోసం కొన్ని శాశ్వత గదులతోపాటు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని సూచించారు.
అన్ని శాఖలు టీమ్ వర్క్తో పని చేయాలని, చేసే విధుల్లో ఒక్కరిపై భారం పడకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. తిరిగి తాను కుంబాభిషేకానికి వస్తానని. అప్పటి వరకు మిగిలిన పనులు పూర్తి కావాలని తెలిపారు. నేషనల్ హైవేపై కుదురుపల్లి బ్రిడ్జి దగ్గర రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశానికి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయ స్థాయిని పెంచాలని, సహాయ కమిషనర్ హౌదా ఇవ్వాలని కమిషనర్కు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాజబాబు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, దేవాలయ ఈఓ మారుతి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిజిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య, జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ మహాదేవపూర్ సీఐ రామచంద్రరావు, కాళేశ్వరం ఎస్ఐ చక్రపాణి, ఎంపీడీవో కె.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.