నవతెలంగాణ హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ లభించింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు. ఇవాళ రాత్రి 7 గంటల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదల కానున్న ఆమె రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.
బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. ఇక రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. సెక్షన్ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్ను మంజూరు చేసింది.