ప్రార్థనా స్థలాల కేసులపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలుచోట్ల వివిధ ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తీసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి  దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆయనతోపాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్వాద్‌, శరద్‌పవార్‌, మనోజ్‌ కుమార్‌ ఝా తదితరులు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని అన్ని జిల్లా కోర్టులు, హైకోర్టులను ఆదేశించింది. ఈ సందర్భంగా జ్ఞానవాపి, మధుర షాహీ ఈద్గా, సంభల్‌ మసీదు అంశాలను ప్రస్తావించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తన స్పందనను తెలియజేసే వరకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.

Spread the love