– మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
– కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి
– తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ అలకనంద ఆస్పత్రిలో జరిగిన వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఆయన శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను మంత్రి పరిశీలించారు. ఆ ఆస్పత్రికి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదనీ, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందని చెప్పారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్కు ఒప్పిస్తున్నారని వివరించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. ఆ హాస్పిటల్ను సీజ్ చేశామనీ, హాస్పిటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి చెప్పారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలనీ, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలని సూచించారు. సీఐడీ విచారణకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా అన్నది ఆరా తీయాలని సూచించారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్రమాల్లో ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను మంత్రి గుర్తు చేశారు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు. ప్రయివేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హాస్పిటళ్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో జరుగు తున్న ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహిం చాలని గతంలోనే మంత్రి ఆదేశాలు జారీ చేశారు.