నవతెలంగాణ – జనగామ: బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పార్థివదేహానికి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సంపత్రెడ్డి అకాల మరణం కలిచివేసిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కాగా, సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.