వెస్ట్‌మారేడుపల్లిలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ ప్రారంభించిన కేటీఆర్‌

నవతెలంగాణ -హైదరాబాద్‌: చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో  కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ కార్యక్రమాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి టిఫిన్‌ చేశారు. రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. దీనివల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డిస్తారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేయనున్నారు.

Spread the love