నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మకద్రోహానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు లేఖాస్త్రం సంధించారు. తెలంగాణలోని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని, రుణ మాఫీ చేస్తామన్న హామీ విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఘనంగా ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉందని, అరకొర రుణమాఫీతో సరిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్షల సంఖ్యలో రైతులు ఉండగా, వారిలో రుణమాఫీ అందనివారే ఎక్కువమంది ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రైతులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, వారికి రుణమాఫీ నిరాకరించారని ఆరోపించారు.