– 120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం
నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు అద్భుత బోటు ప్రయాణాన్ని నేడు కార్తీక మాసం తొలిరోజు పర్యాటకశాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్లాన్ చేస్తున్నప్పటికీ నాగార్జునసాగర్ డ్యాంలో సరైన మట్టంలో నీటి లభ్యత లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదాపడుతూ వచ్చింది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృతస్థాయిలో వర్షాలు పడడం వల్ల కృష్ణానది తీరం వెంట, అటు శ్రీశైలం నుండి ఇటు నాగార్జునసాగర్ డ్యాం వరకు గరిష్ట మట్టంలో నీటి లభ్యత ఉండటం వల్ల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నేడు నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు ఈ బోట్ (లాంచ్) ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ లాంచ్ ప్రయాణానికి మొట్టమొదటి రోజున తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిసర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. పర్యాటకులు నాగార్జునసాగర్ నుండి నందికొండ మీదుగా, ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ నేడు శ్రీకారం చుట్టింది. మరొక టూరిజం ప్యాకేజి, నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా నేడు అందుబాటులోకి తెచ్చింది.. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు నేడు ప్రారంభించారు. శ్రీశైలం వరకు (120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600 టికెట్ ధర నిర్ణయించారు. ఒకవైపు మాత్రమే. ఇది కేవలం జర్నీకి సంబంధించిన రుసుము మాత్రమే. శ్రీశైలంలో రూమ్, ట్రాన్స్పోర్ట్ వంటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడిపిస్తారు.