వనస్థలిపురం‌లో చిరుతపులి కదలికలు…

నవతెలంగాణ – హైదరాబాద్ : వనస్థలిపురం‌లో చిరుతపులి కదలికలు కనిపించడంతో స్థానికంగా అలజడి నెలకొంది.చిరుత కదలికలతో స్థానికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు. అయితే స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది పరిసర ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ కాంప్లెక్స్ ఏరియాలో చిరుత కనిపించిందని నిన్న రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. వెంటనే స్పందించి మేము మా సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుత పులి ఆనవాళ్ల కోసం చూశామని తెలిపారు. రాత్రి ఉదయం కూడా పరిశీలించామని ఎక్కడ చిరుతపులి అడుగు జాడలు దొరకలేదని చెప్పారు. చిరుత 24గంటల్లో సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు.ఇబ్రహీంపట్నం అడవీ వరకు వెళ్లే అవకాశం ఉందని అక్కడి ఫారెస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే బోన్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. కాలనీ వాసులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని చెప్పారు. రాచకొండ పోలీసుల సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటామని.. ఒకవేళ చిరుత కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.

Spread the love