– మహారాష్ట్రలో తొలిసారిగా మహిళా రైతు రాష్ట్ర సదస్సు
– ప్రారంభించిన ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
-17 పాయింట్ల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను ప్రవేశపెట్టిన ఏఐకేఎస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నారిశక్తి సత్తాను మరోసారి చూపుదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఏఐకేఎస్ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ నాసిక్ నగరంలోని కామ్రేడ్ గోదావరి పరులేకర్ హాల్లో మొట్టమొదటి మహిళా రైతు రాష్ట్ర సదస్సును నిర్వహించింది. 15 జిల్లాల నుంచి మొత్తం 515 మంది ప్రతినిధులు హాజరయ్యారు. థానే-పాలెర్ (155), అహ్మద్నగర్ (109), నాసిక్ (93) అనే మూడు జిల్లాల నుంచి రైతు మహిళల అతిపెద్ద సమీకరణ జరిగింది. కిసాన్ సభ జెండా ఎగురవేసిన అనంతరం ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ దేశ్ముఖ్ స్వాగతించారు. ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజిత్ నవాలే సమావేశం లక్ష్యాన్ని వివరించారు. ఇది ఐదుగురు సభ్యులతో కూడిన అధ్యక్షవర్గంతో మొత్తం మహిళల వేదికగా నిలిచింది. ఈ సదస్సును ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ప్రారంభించారు. మహిళా కిసాన్ అధికార్ మంచ్కి చెందిన సీమా కులకర్ణి సభలో ప్రసంగించారు. ఏఐకేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ కవితా వారే 17 పాయింట్ల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై సీఐటీయూ, ఐద్వా, ఎఐఏడబ్ల్యూయూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ తదితర సంఘాల నుంచి 21 మంది మహిళా ప్రతినిధులు మాట్లాడారు.
ఈ సదస్సులో సీఐటీయూ ఉపాధ్యక్షులు డాక్టర్ డీఎల్ కరాడ్, దహను నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే వినోద్ నికోలే, సీఐటీయూ శ్రామిక మహిళా నాయకులు శుభ షమీమ్, ఆనంది అవఘాడే, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు నసీమా షేక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి దత్తా చవాన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోమనాథ్ నిర్మల్ మాట్లాడారు. ఏఐకేఎస్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే ముగింపు ప్రసంగం చేశారు. గ్రామీణ మహారాష్ట్ర అంతటా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, మహిళా రైతుల జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. డిమాండ్స్ చార్టర్లో హైలైట్ చేసిన అంశాలపై పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.న