నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. గణేష్ చతుర్ధిని పురస్కరించుకొని పాత భవనాన్ని వీడి ఎంపీలు కొత్త భవనంలోకి మారారు. ప్రత్యేక పూజ అనంతరం మధ్యాహ్యం 1 గంటల తర్వాత కొత్త భవనంలో లోక్సభ కొలువుదీరింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అభియాన్’ పేరుతో కేంద్రం తీసుకొచ్చింది. బిల్లును సభ్యుల ముందు ఉంచిన కొద్దిసేపటకే దిగువ సభ రేపటికి వాయిదా పడింది. రేపటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపున్నారు. ఇక ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.