లారీలను తొందరగా అన్లోడ్‌ చేసుకోవాలి

మిల్లర్లను ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్‌ రమేష్‌
నవతెలంగాణ-తూప్రాన్‌రూరల్‌/మనోహరాబాద్‌
మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా దించుకుంటేనే తిరిగి లోడింగ్‌ చేయడానికి అవకాశాముంటుందని, కాబట్టి హమాలీలలను అధిక సంఖ్యలో పెట్టుకొని లారీలు వచ్చిన 24 గంటల్లోగా ధాన్యం ఆన్‌లోడ్‌ చేయాలని అదనపు కలెక్టర్‌ రమేష్‌ మిల్లర్లకు సూచించారు. గురువారం తూప్రాన్‌ పట్టణంలోని నవదుర్గ రైస్‌ మిల్‌, సాయినాథ రైస్‌ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని వెంటవెంటనే దించుకోవాలని సూచించారు. తద్వారా కొనుగోలు కేంద్రాల నుంచి కూడా ధాన్యాన్ని త్వరత్వరగా లోడింగ్‌ చేయడానికి అవకాశముంటుందన్నారు. ధాన్యంలో కోత పెట్టరాదని, వెంటనే ట్రక్‌ షీట్‌ జారీచేయాలన్నారు. అదేవిధంగా పెండింగ్‌ సి.ఏం.ఆర్‌. రైస్‌ను రోజు వారి లక్ష్యం మేరకు నెలాఖరులోగా భారత ఆహార సంస్థకు తరలించాలని సూచించారు. గన్ని సంచులు, లారీల సమస్య తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నామన్నారు. ఈ పక్షం రోజులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి రోజు కొనుగోళ్లు ఆగకుండా, రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని రమేష్‌ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 33, 776 మంది రైతుల నుంచి 295 కోట్ల 33 లక్షల విలువ గల 1,43,362 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కోనుగోలు చేసి 10,379 6 మంది రైతుల ఖాతాలో రూ.84.76 కోట్లు వేశామన్నారు. టాబ్‌ ఎంట్రీ కూడా వేగవంతంగా జరుగుతున్నదని త్వరలో మిగతా రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తామని రమేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.డి.ఓ. శ్యామ్‌ ప్రకాష్‌, తహశీల్ధార్‌ జ్ఞాన జ్యోతి పాల్గొన్నారు.
నవ తెలంగాణ-నర్సాపూర్‌ : రైస్‌ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్‌ చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ రమేష్‌ సూచించారు. గురువారం నర్సాపూర్‌ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మి రైస్‌ మిల్లును అదనపు కలెక్టర్‌ రమేష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకు వస్తున్న లారీలను వెంటనే అన్లోడ్‌ చేసి పంపించాలని రైస్‌ మిల్‌ సిబ్బందికి సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాకులు, రైస్‌ మిల్లర్లు చూడాలన్నారు.

Spread the love