– 40 శాతం సంపద ఒక్క శాతం వారివద్దే
– వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ అధ్యయనంలో వెల్లడి
భారత్లోని ఆర్థిక అసమానతను తగ్గించడానికి సంపన్నులపై అదనంగా అత్యల్ప పన్ను వేస్తే చాలని వాల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ఓ రిపోర్ట్లో తెలిపింది. ఈ పదేండ్లలో దేశంలో భారీగా అసమానలు పెరిగాయని వెల్లడించింది. భారత్ అభివృద్థి చెందుతున్న దేశమయినప్పటికీ.. ఆదాయ అసమానతలను తగ్గించడానికి, పరిష్కరించడానికి ప్రోగ్రెసివ్ వెల్త్ టాక్స్, సమగ్ర పన్ను (కంప్రంహెన్సివ్ టాక్స్) విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ”ఇన్కం అండ్ వెల్త్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా 1922-2023” పేరుతో వాల్డ్ ఇనీక్వాలిటీ ఈల్యాబ్ రిపోర్ట్ను విడుదల చేసింది.
నవ తెలంగాణ – బిజినెస్ డెస్క్
దేశంలోని ఒక్క శాతం సంపన్నులపై అదనంగా వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేదల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చని, సామాజిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగించవచ్చని రచయితలు, ఆర్థికవేత్తలు నితిన్ కుమార్ భర్తి, లూకస్ చాన్సెల్, థామస్ పికెట్టి, అన్మోల్ సోమంచి సూచించారు. అత్యంత సంపన్నుల కోసం సమగ్రమైన, ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీని ప్రవేశపెట్టడం ద్వారా భారత్లో పెరుగుతున్న ఆదాయం, సంపద అసమానతలను పరిష్కరించవచ్చన్నారు.
రూ.100 కోట్ల ఆదాయంపై 4 శాతం పన్ను
ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత జనాభాలో అత్యంత సంపన్నులైన ఒక్క శాతం మంది దేశ ఆదాయంలో 22.6 శాతం, సంపదలో 40.1 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. 2014-15 నుంచి 2022-23 మధ్య దేశంలో భారీగా అసమానతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వాల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదికలో నిపుణులు ‘కోటిశ్వరుల పన్ను’ను ప్రతిపాదించారు. 2022-23లో రూ.10 కోట్లు దాటిన వారు మాత్రమే చెల్లించేలా చూడాలన్నారు. ఈ స్థాయి వారు దేశంలో కేవలం 0.04 శాతం పెద్దలు మాత్రమే ఉన్నారని అంచనా వేశారు. పన్ను ప్యాకేజీలో బేస్లైన్, మోడరేట్, యాంబీషస్ పేర్లతో మూడు రకాల పన్నులను ప్రతిపాదించారు. బేస్లైన్ వేరియంట్లో రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులపై వార్షిక పన్ను 2 శాతం విధించాలి. రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లపై 33 శాతం వారసత్వ పన్ను (ఇన్హేటిటెన్స్ రూ.10 కోట్లు దాటితే కరోడ్పతి ట్యాక్స్ టాక్స్) వేయాలి. ఇది ఒక్కటే జీడీపీలో 2.7 శాతం రాబడిని పెంచుతుంది. మోడరేట్ వేరియంట్ కింద రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య నికర విలువ కలిగిన వ్యక్తులపై పన్నును 4 శాతానికి పెంచాలి. ఈ విలువ కలిగిన ఎస్టేట్లపై 33 శాతం వారసత్వ పన్ను వేయాలి. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లకు, వారసత్వ పన్నును 45 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ఈ పన్ను విధానం భారత జీడీపీలో 4.6 శాతానికి సమానమైన ఆదాయాన్ని ఆర్జించగలదు.యాంబీషస్ పన్ను విధానంలో వ్యక్తులపై పన్ను రేట్లను 3 శాతం నుంచి 5 శాతం మధ్య, ఎస్టేట్లపై వారసత్వాలకు 45 శాతం నుంచి 55 శాతం మధ్య పన్ను పెంచాలని ప్రతిపాదించింది. దీంతో స్థూల జీడీపీలో పన్ను రాబడులు 6.1 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది.
విద్యా, వైద్యం కోసం ఖర్చు..
”సంపన్నులపై వేసే పన్నులతో వచ్చే ఆదాయాన్ని పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, విద్యా, వైద్యం, ఇతర సామాజిక రంగాలలో ఖర్చు చేయాలి. తద్వారా పున్ణ పంపిణీ విధానాలలో పెట్టుబడి పెట్టవచ్చు. తమ ప్రతిపాదిత సంపద పన్ను ప్యాకేజీలు సామాజిక రంగ వ్యయాన్ని విస్తరించడానికి, విత్త అవకాశాలను సృష్టించడానికి దోహదం చేస్తాయి. బేస్లైన్ వేరియంట్ సంపద, వారసత్వ పన్నుల ద్వారానే ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేయడానికి వీలుంది. అదే విధంగా మోడరేట్ వేరియంట్ టాక్స్ ద్వారా ఉమ్మడి ఆరోగ్యం, విద్యా బడ్జెట్ను దాదాపు రెట్టింపు చేయవచ్చు.” అని రిపోర్ట్ పేర్కొంది. అంబీషస్ వేరియంట్ పన్నుల ద్వారా ఆరోగ్యం, విద్యా, ప్రభుత్వ సంయుక్త బడ్జెట్ను రెట్టింపు చేయడానికి వీలుంది. పైగా అదనంగా మిగులు కూడా ఉంటుంది. ఈ పన్నుల విధానం దేశంలోని కేవలం 0.04 శాతం మంది పైనే ప్రభావం చూపుతుంది.
అగ్ర కులాలదే ఆధిపత్యం
భారత్లోని ఆర్థిక అసమానతలు కులాలతోనూ ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఈ రిపోర్ట్ విశ్లేషించింది. ”దేశంలోని అగ్ర కులాలు జాతీయ సంపదలో గణనీయమైన అసమాన వాటాను కలిగి ఉన్నాయి. భారతీయ బిలియనీర్లు ఎక్కువగా ఉన్నత కులాల క్లబ్గా ఉన్నారు. ఒక ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీ విధానం తక్కువ సంఖ్యలో ఉన్న అతి సంపన్న, ఉన్నత కుల కుటుంబాలపై మాత్రమే కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిపాదిత పన్ను విధానంతో అట్టడుగు కులాలు, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని ద్వారా విపరీతమైన సంపద అసమానతలను పరిష్కరించడమే కాకుండా.. భారత్లోని సామాజిక, ఆర్థిక అసమానతల మధ్య ధృడమైన సంబంధాన్ని బలహీనపరచడంలో ఇటువంటి పన్నులు కీలక పాత్ర పోషించనున్నాయి.” అని వాల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ తన రిపోర్ట్లో స్పష్టం చేసింది.