రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

నవతెలంగాణ – హైదరాబాద్:  సినీ నటి రష్మిక మందన్నా  డీప్‌ఫేక్‌ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఓ నేషనల్‌ ఛానెల్‌ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. రష్మిక మార్ఫింగ్‌ వీడియో గురించి ప్రస్తావించారు. అదో అవమానకరమైన చర్యగా అభివర్ణించారు నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో గురించి వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Spread the love