నవతెలంగాణ – వరంగల్: మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో టెక్స్టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి, యంగ్వన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టీఎస్ఐఐసీ టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలను కేటాయించింది. తమ వస్త్ర పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. యంగ్వన్ కంపెనీ టెక్స్టైల్ పార్కులో రూ.840 కోట్ల పెట్టనుంది.